Civil defence mock drill on May 7 | జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 26మంది పర్యాటకులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి.
ఇప్పటికే భారత్ పలు దౌత్య నిర్ణయాలతో పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి.
యుద్ధం వంటి అత్యవసర పరిస్థితులు వస్తే పౌరులు ఎలా స్పందించాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలనే విషయంపై అవగాహన కోసం అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర మంత్రిత్వశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
వైమానిక దాడుల హెచ్చరిక వ్యవస్థలు సమర్థతను అంచనావేయడం, భారత వైమానిక దళంతో అనుసంధానమై ఉన్న రేడియో లింక్స్ నిర్వహణను చూడటం, కంట్రోల్ రూమ్లు, షాడో కంట్రోల్ రూమ్ల పనితీరును పరీక్షించడం, శత్రు దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడంపై పౌర రక్షణ వ్యవస్థలపై పౌరులకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం వంటివి మాక్ డ్రిల్ ప్రధాన లక్ష్యం.
244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్, వైజాగ్ కూడా ఉన్నాయి. ఈ తరుణంలో గతంలో ఎప్పుడైనా భారత్ లో సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించారా అనేది ఆసక్తిగా మారింది. చివరి సారిగా 1971లో భారత్ లో మాక్ డ్రిల్స్ ను చేపట్టారు.
1971 లో పాక్-భారత్ మధ్య బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధం సమయంలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. 1962లో చైనాతో, 1965, 1971 లో పాక్ తో భారత్ చేసిన యుద్ధం నేపథ్యంలోనే ప్రభుత్వం మాక్ డ్రిల్స్ చేపట్టింది.
ఆ సమయంలో ప్రజలు కొద్దిసేపు ఇళ్లలోని లైట్లను ఆపేసినట్లు పలు ఆంగ్ల కథనాలు పేర్కొన్నాయి. కొందరు ఇళ్ల బయట పడుకుని చెవులు మూసుకున్నట్లు గుర్తుచేశారు.