Kakinada Gym Trainer Murder వివాహేతర సంబంధం కారణంగా ఏర్పడిన వివాదంతో ఓ జిమ్ ట్రైనర్ తన స్నేహితుడి చేతిలోనే దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘోర సంఘటన కాకినాడలోని రామకృష్ణారావుపేట ప్రాంతంలో వెలుగుచూసింది.
రామకృష్ణారావుపేటలో జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్న కొడమాటి సతీష్ రెడ్డి (30)గా గుర్తించారు. అతనికి ఏడాది క్రితమే వివాహం జరగ్గా, భార్య జయశ్రీ ప్రస్తుతం గర్భిణిగా ఉంది.
ఈ క్రమంలో సతీష్ రెడ్డి, తన స్నేహితుడైన సాయికిరణ్ ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసినప్పటి నుండి సతీష్ రెడ్డి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
భర్త తీరు మారకపోవడంతో భార్య జయశ్రీ ఈ వివాహేతర సంబంధం గురించి సాయికిరణ్కు చెప్పింది. దీంతో సతీష్, సాయికిరణ్ మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు మొదలయ్యాయి.
హత్య జరిగిన తీరు..
బుధవారం రాత్రి 2 గంటల సమయంలో సాయికిరణ్ తన ఇతర స్నేహితులతో కలిసి సతీష్ రెడ్డితో మరోసారి గొడవకు దిగాడు.
వివాదం ముదరడంతో ఆగ్రహానికి గురైన సాయికిరణ్, చెక్క ముక్కతో సతీష్ తలపై బలంగా కొట్టాడు. ఆ దాడిలో చెక్క ముక్క విరిగిపోవడంతో, దాని సూదిగా ఉన్న మొనతో సతీష్ రెడ్డి మెడపై దారుణంగా పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై సతీష్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు సాయికిరణ్ మరియు అతని అనుచరుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.







