Terrorists Kidnap Telangana Man | బతుకుదెరువు కోసం ఖండాంతరాలు దాటి వెళ్లిన ఓ తెలంగాణ యువకుడు ఉగ్రవాదుల చెరలో బంధీ అయ్యాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస ప్రవీణ్ (Nallamasa Praveen) అనే యువకుడు హైదరాబాద్ లోని ఓ బోర్ వెల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
కొద్ది నెలల కిందట కంపెనీ పని మీద ఆఫ్రికాలోని మాలి దేశానికి వెళ్లాడు. ప్రవీణ్ గత 22న చివరిసారిగా అతడు తల్లిదండ్రులతో సంప్రదించాడు. 23న సాయంత్రం విధులకు వెళ్లి తిరిగి తను ఉండే గదికి వస్తుండగా మార్గమధ్యలో జేఎన్ఐఎం అనే ఉగ్రవాద సంస్థ అతడిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
అప్పటి నుంచి ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ నెల 4న కంపెనీ ప్రతినిధులు ఫోన్ చేసి ప్రవీణ్ కిడ్నాప్ అయిన విషయాన్ని తల్లిదండ్రులకు ధ్రువీకరించారు.
ప్రస్తుతం ప్రవీణ్ ఆచూకీ కోసం కంపెనీ యాజమాన్యం భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమారుడిని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.






