YSRCP Reacts On CM Revanth Reddy Comments | తెలంగాణ శాసనసభ వేదికగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపిన చరిత్ర తనది అని సీఎం ప్రకటించారు. అవసరమైతే దీనిపై నిజ నిర్దారణ కమిటీకి కూడా సిద్ధమే అని సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించింది వైసీపీ. మరోసారి ముసుగు తొలగిపోయింది, రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు మరణశాసనం రాశారు అంటూ జగన్ పార్టీ విరుచుకపడింది. ‘రాష్ట్రాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని చంద్రబాబు దారుణంగా దెబ్బతీశారు. రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిచేసేందుకు, చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం వెలుగులోకి వచ్చింది. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబు బలిపెట్టారు. తాను కోరినందునే చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపేశారని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక విషయాలు చెప్పారు. చంద్రబాబుతో ఏకాంత సమావేశంలో తాను కోరగానే ఒప్పుకున్నారంటూ ఆయన వెల్లడించారు. అందుకనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయని కావాలంటే నిజనిర్ధారణ కమిటీ కూడా వెళ్లి చూసుకోవచ్చని అన్నారు’ అని జగన్ పార్టీ పేర్కొంది.










