Ys Jagan News Latest | విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి తాను గర్వపడుతున్నట్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ వైసీపీ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైయస్సార్కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకున్నారని ఈ సందర్భంగా అభినందించారు.
క్లిష్ట సమయంలో నాయకులు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందరికీ జగన్ అభినందనలు తెలిపారు. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెబుతూ జగన్ పోస్ట్ చేశారు.