Monday 30th June 2025
12:07:03 PM
Home > తెలంగాణ > అమిత్ షా-కేటీఆర్ భేటీ.. బీజేపీ-బీఆరెస్ బంధానికి దారితీస్తుందా!

అమిత్ షా-కేటీఆర్ భేటీ.. బీజేపీ-బీఆరెస్ బంధానికి దారితీస్తుందా!

amit shah ktr
  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే అంటున్న గులాబీ వర్గం
  • రాజకీయ చర్చలూ ఉండొచ్చనే అనుమానాలు
  • కాంగ్రెస్ బలపడటంతో బీజేపీ-బీఆరెస్ బంధంపై సందేహాలు!

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. శుక్ర, శనివారాల్లో  అక్కడే మకాం వేసి, పలువరు కేంద్ర మంత్రులను, పలు శాఖల అధికారులను కలవనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా భేటికానున్నారు.

రాష్ట్రంలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరడానికి కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర అంశాల విషయంలో కేంద్రంపై మరోసారి ఒత్తిడి తీసుకురావడానికే ఈ పర్యటన ఉందని గులాబీ నేతలు చెబుతున్నారు.  

రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలకు, హోంశాఖ పరిధిలో ఉన్న భూముల గురించి కేటీఆర్‌ అమిత్‌ షాతో చర్చించనునన్నట్లు సమాచారం. అదేవిధంగా నగరంలో నిర్మించనున్న స్కై వేల నిర్మాణం కోసం రక్షణశాఖ నుంచి అడుగుతున్న కంటోన్మెంట్‌ భూముల వ్యవహారం గురించి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశం అవనున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌ మామునూరు ఎయిర్‌ పోర్ట్‌ కు సంబంధించిన అంశంతోపాటు, నగరంలో మరిన్ని ప్రాంతాలకు మెట్రో విస్తరణకు సంబంధించి ఆయా శాఖల మంత్రులతో కేటీఆర్‌ భేటీ కానున్నారు.

రాజకీయ చర్చలేం లేవా..!

తెలంగాణలో బీఆరెస్‌-బీజేపీ మధ్య ఉప్పు నిప్పు బంధం ఉంది. 2019 సార్వత్రిక అనంతరం 4 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, బండి సంజయ్ సారథ్యంలో కాస్త పుంజుకుంది. అప్పటి నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని జనాల్లోకి వెళుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తోంది టీ బీజేపీ.

మరోవైపు మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అంశం రెండు పార్టీల మధ్య మరింత నిప్పు రాజేసింది. ఇలాంటి తరుణంలో మంత్రి కేటీఆర్ అనూహ్యంగా ఢిల్లీ వెళ్లడం, కేంద్రం మంత్రులతో భేటి కావడం పలు సందేహాలకు తావిస్తోంది. పైకి రాష్ట్ర ప్రయోజనాల కోసమే పర్యటన అని చెబుతున్నా.. వారి మధ్య తాజా పరిస్థితుల మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశాలూ ఉండొచ్చని విశ్లేషకుల భావిస్తున్నారు.

బీజేపీకి బీఆరెస్ దగ్గరవుతోందా..!

మొన్నటివరకు కేంద్ర ప్రభుత్వంపై బీఆరెస్ నుంచి మాటల దాడి విపరీతంగా జరిగింది. సీఎం కేసీఆర్ మొదలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం విమర్శలు చేశారు. కానీ, కొన్నాళ్లుగా బీఆరెస్ నుంచి బీజేపీపై విమర్శలు తగ్గాయి. లిక్కర్ స్కాం అంశంలో కవిత పేరు ఉండటంతో తగ్గారేమో అని భావిస్తున్నప్పటికీ మరేవో కారణాలు కూడా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ముఖ్యంగా ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆ ప్రభావం తెలంగాణపై కూడా పడింది. రాష్ట్ర పార్టీ నాయకుల్లో కొత్త ఉత్తేజం వచ్చింది. దానికి తోడు రేవంత్ రెడ్డికి పార్టీ సీనియర్లతో బంధం బలపడుతోంది. పొంగులేటి, జూపల్లి లాంటి మరికొందరు నాయకులు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు.

దీనికి తోడు తెలంగాణ లో కాంగ్రెస్ గెలిచే అవకాశమే ఉంటే బీజేపీ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపునే కోరుకుంటుంది అని ఒక బీజేపీ జాతీయ నాయకుడు పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతున్న వేళ బీజేపీ-బీఆరెస్ రెండు పార్టీలు దగ్గరయ్యే సూచనలు ఉన్నాయని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

అనుమానాలకు తావిస్తున్న మిషన్ 2024 భేటి!

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్ని ఏకమవుతున్నాయి. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్ నేత్రుత్వంలో పాట్నా లో “మీషన్ 2024” అనే సమావేశం జరుగుతుంది.

అయితే ఈ సమావేశానికి కేసీఆర్ ని నితీష్ కుమార్ ఆహ్వానించలేదు. అంతేకాకుండా శరద్ పవార్ కూడా బీఆరెస్ ను బీజేపీకి బి-టీం అని వ్యాఖ్యానించారు. దీంతో కేసీఆర్ నిజంగా బీజేపీ కి వ్యతిరేకమా లేదా అని సందేహం దేశ వ్యాప్తంగా అందరిలోనూ మొదలయ్యింది.

ఇన్ని సందేహాల మధ్య అమిత్ షా-కేటీఆర్ భేటి రాష్ట్ర రాజకీయ వర్గాలో కొత్త అనుమానాలను రేకిత్తిస్తోంది. అసలు వారిరువురూ భేటీ లో ఏం చర్చిస్తారో, ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారో కొన్ని రోజులు ఆగితే కానీ తెలీదు.

ఏదీ ఎలా ఉన్నప్పటికీ తెలంగాణ బీజేపీ నాయకులకు మాత్రం అమిత్ షా కేటీఆర్ భేటీ కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది.  ఓవైపు తాము బీఆరెస్ కు వ్యతిరేకంగా పోరాడుతుంటే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, తద్వారా రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లుతోందని తలలు పట్టుకుంటున్నారు.

You may also like
పాశమైలారంలో భారీ పేలుడు..సీఎం రేవంత్, కేసీఆర్ దిగ్భ్రాంతి
‘ఒక్క పసుపు బోర్డును ఇన్ని సార్లు ప్రారంభించడం ఏంటి?’
ఏపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షులపేర్లు ఖరారు చేసిన అధిష్టానం!
‘నలభై ఏళ్ల కల నిజమైంది..పసుపు బోర్డు వచ్చింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions