Telangana’s Salary Bill Surges | జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న కొందరు సీనియర్ పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.2 లక్షల పైగానే వేతనం పొందుతున్నారు. అలాగే ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల్లో పనిచేసే సీనియర్ ఇంజనీర్లు నెలకు రూ.7 లక్షలకు పైగానే జీతం పొందుతున్నారు. గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల భారం గణనీయంగా పెరిగింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన నాటితో పోలిస్తే, ప్రస్తుతం వేతనాల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు దాదాపు నాలుగు రెట్లు పెరిగి నెలకు రూ. 6 వేల కోట్లకు చేరుకుందని ఓ నివేదికలో వెల్లడైంది.
ప్రభుత్వ విద్యుత్ సంస్థలు టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లాంటి సంస్థల్లో చీఫ్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నవారు నెలకు రూ. 7 లక్షల వరకు జీతం అందుకుంటున్నారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే పే-రివిజన్ల కారణంగా వీరి వేతనాలు ఈ స్థాయికి చేరాయి. జీహెచ్ఎంసీలో పనిచేసే రెగ్యులరైజ్డ్ సీనియర్ క్లాస్-4 కార్మికులు సుదీర్ఘ సర్వీసు ఉన్నవారు నెలకు దాదాపు రూ. 2 లక్షల వరకు వేతనం పొందుతున్నారని నివేదికలో ఉంది. తెలంగాణ రెవెన్యూలో 45 శాతం జీతాలు, పెన్షన్లు, అప్పులకు వడ్డీలు చెల్లించడానికే సరిపోతోందని 2023-24 నాటి కాగ్ రిపోర్టు వెల్లడించిన విషయం తెల్సిందే.










