TG Government Offices | రానున్న నూతన సంవత్సరం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఖజానాపై అద్దె భారాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది.
జనవరి 1 నుంచి రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా ప్రైవేటు అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది.
ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. రానున్న కొత్త ఏడాది నుంచి పరిపాలన అంతా సొంత భవనాల్లోనే సాగాలని ఆదేశించారు.
ఇది కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా కఠినమైన ఆర్థిక నిబంధనలను కూడా విధిస్తోంది. డిసెంబర్ 31 లోపు ప్రైవేటు భవనాలను ఖాళీ చేసి.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోకి మారాలని స్పష్టం చేసింది.
ఒకవేళ ఈ నిర్ణయంలో నిర్లక్ష్యం వహిస్తే ఫిబ్రవరి 1 నుంచి ప్రైవేటు భవనాలకు అద్దె చెల్లింపులను నిలిపివేయాలని ట్రెజరీ విభాగానికి సర్క్యులర్ జారీ అయింది.
గడువు దాటిన తర్వాత కూడా అద్దె భవనాల్లోనే కొనసాగితే ఆ అద్దెను సంబంధిత శాఖాధికారి తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించాల్సి ఉంటుంది.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలు తరలిపోవడంతో ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తున్న ఆఫీసులను హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చిన బీఆర్కే భవన్, గగన్ విహార్ వంటి భవనాల్లోకి మార్చనున్నారు.










