Rajnath Singh Hails Operation Sindoor | పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భరతమాత గడ్డపై అడుగుపెట్టి అనేక కుటుంబాలకు చెందిన ఆడవారి సింధూరాలను తుడిచివేశారని అందుకే ‘ఆపరేషన్ సింధూర్’ ను భారత్ చేపట్టినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ లో బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని కేంద్రమంత్రి విర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులకు భారత్ గట్టి బుద్ధి చెప్పిందన్నారు. ఆపరేషన్ సింధూర్ తో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని, దింతో భారత సైన్యంపై ప్రజలు అభినందనల వర్షం కురిపిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, ఉగ్రవాదంపై భారత రాజకీయ, సామాజిక సంకల్పానికి నిదర్శనమన్నారు. ఉగ్రవాదులతో పాటు భారత వ్యతిరేక శక్తులపై సైన్యం ప్రతీకారం తీర్చుకుందని తెలిపారు. భారత సైన్యం తన పరాక్రమంతో పాక్ సైనిక ప్రధాన కేంద్రమున్న రావల్పిండి లోనూ గర్జించిందన్నారు.
పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులు, ఉగ్ర శిభిరాలపై మాత్రమే సైన్యం దాడి చేసిందని, పాక్ పౌరులకు ఎలాంటి హాని కలిగించలేదని స్పష్టం చేశారు. కానీ దాయాధి దేశం మాత్రం భారత పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడిందని మండిపడ్డారు.










