Rajnath Singh Hails Operation Sindoor | పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో భారత ‘ఆపరేషన్ సింధూర్’ విజయం పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హనుమంతుడి లంకా దహనాన్నే ఆదర్శంగా తీసుకుని ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు పేర్కొన్నారు.
రైట్ టు రెస్పాండ్ వాడుకుని కచ్చితమైన సమాచారం ఆధారంగానే దాడులు చేసినట్లు వివరించారు. అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసి భారత సైన్యం సత్తా చాటిందని హర్షం వ్యక్తం చేశారు. పహల్గాంలో అమాయకుల ప్రాణాలు తీసినవారు మూల్యం చెల్లించుకున్నారని తెలిపారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ శత్రువులకు తగిన బుద్ధి చెప్పామన్నారు. ఉగ్రమూకల స్థైర్యాన్ని దెబ్బతీశామని, ఈ దాడుల్లో పాక్ పౌరులకు ఎలాంటి హాని జరగలేదన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయంతో దేశ ప్రజలు త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తున్నారని కేంద్ర రక్షణ మంత్రి స్పష్టం చేశారు.










