Pawan Kalyan And Jr.NTR | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
సామాజిక మాధ్యమాల్లో తమ ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య అవసరాలకు వినియోగించడం, తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతోందని ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. వీరిద్దరి తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు.
మార్ఫింగ్ ఫొటోలు, అవమానకర పోస్టులు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుల్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ను ప్రతివాదులుగా చేర్చారు.
అయితే ఇప్పటికే కొన్ని లింకులను తొలగించినట్లు ప్రతివాదులు కోర్టుకు వివరించారు. కాగా, తొలగించిన లింకులపై ఆదేశాలు జారీ చేయడానికి ముందు సంబంధిత ఖాతాదారులకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆ లింకులకు సంబంధించిన ఖాతాల బీఎస్ఐ, ఐపీ లాగిన్ వివరాలను మూడు రోజుల్లో అందజేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 12వ తేదీకి వాయిదా వేసింది.










