Operation Sindoor News | మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత, బుధవారం వేకువజామున సరిగ్గా ఒంటిగంట ఐదు నిమిషాల సమయంలో, పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరల్లో భారత్ ను అల్లకల్లోలం చేసేందుకు సన్నద్ధమవుతున్న ఉగ్రవాదులు నిద్రలో ఉన్నారు.
ఇదే సమయంలో ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులు వారిపై విరుచుకుపడ్డాయి. కేవలం 25 నిమిషాల్లోనే పాక్ లో ఉన్న తొమ్మిది ఉగ్రస్థావరాలు నేలమట్టం అయ్యాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదుల ఊపిరి ఆగింది. తొమ్మిది ఉగ్రస్థావరల్లో లష్కరే హెడ్ క్వాటర్ అయిన మార్కాజ్ తోయిబా కూడా ఉంది.
సరిహద్దుకు ముప్పై కీ.మీ. దూరంలో ఉన్న లష్కరే క్యాంపులో 26/11 ముంబయి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు గతంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. కరుడుగట్టిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ ఇదే స్థావరంలో ట్రైనింగ్ తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మరో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కు చెందిన మర్కజ్ సుబాన్ స్థావరం సరిహద్దుకు 100కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్ ప్రాంతంలో ఉంది. ఈ రెండు ఉగ్ర స్థావరాలతో పాటు మరో ఏడు క్యాంపులను భారత ఆర్మి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా నేలమట్టం చేశారు. సరిగ్గా అర్ధరాత్రి 1.05 గంటలకు ప్రారంభమైన సింధూర్ ఒంటి గంట 30 నిమిషాలకు పూర్తయ్యింది.
25 నిమిషాల వ్యవధిలోనే భారత భద్రతా దళాలు తొమ్మిది ప్రాంతాల్లోని 21 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయి. భారత ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రజలు అభినందలు వ్యక్తం చేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వడం పట్ల యావత్ దేశం సంబరాలు చేసుకుంటుంది. మరోవైపు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది.