Nara Lokesh News | చదువుకోవాలని ఉంది కానీ కడు పేదరికం ఆమెకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మంత్రాలయం మండలం బూదురు గ్రామానికి చెందిన మీనిగ కుమార్, సంతోషమ్మ దంపతులకు ముగ్గురు సంతానం.
గ్రామంలో ఐదవ తరగతి వరకే పాఠశాల సదుపాయం ఉంది. పక్క గ్రామానికి వెళ్లి చదువుకోలేని దుస్థితి. దింతో ఈ దంపతుల కుమార్తె అయిన జెస్సీ ఐదవ తరగతి వరకు చదివి, కేజీబీలో సీటు రాకపోవడంతో పత్తి పొలంలో కూలి పనికి వెళ్తుంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వార్త కథనం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్ళింది.
చిట్టి తల్లీ నిశ్చింతగా చదువుకో..కేజీబీవీలో సీటు ఇప్పించే బాధ్యత తనది అని భరోసా ఇచ్చారు. కేజీబీవీలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళుతున్న జెస్సీ ఘటన తనను కదిలించిందని ఆవేదన చెందారు. పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. పిల్లలను బడికి పంపితే తల్లికి వందనం వస్తుందని తెలిపారు.
పిల్లల భద్రత -భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం లేదన్నారు. విద్యకు పిల్లలను దూరం చేయొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.










