TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TG-RTC) చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు 290 కోట్ల మంది మహిళలు ప్రయాణించి, ఏకంగా 10 వేల కోట్ల రూపాయల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్నారు.
ఈ చారిత్రాత్మక విజయంపై మంగళవారం హైదరాబాద్లో ఘనంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లుడుతూ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. నేడు 10 వేల కోట్లు మహిళల జేబుల్లో మిగిలాయంటే అది ప్రజా పాలన విజయమేనన్నారు.
కేవలం ప్రయాణికులే కాదు, మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని, ప్రతిరోజూ 65 లక్షల మంది ప్రయాణికుల్లో 40 లక్షల మంది మహిళలే ఉండటం గర్వకారణమని తెలిపారు.
ఈ పథకం సక్సెస్ వెనుక డ్రైవర్లు, కండక్టర్ల కష్టం మరువలేనిదని, ముఖ్యంగా రాఖీ పండుగ వంటి రోజుల్లో కుటుంబాలకు దూరంగా ఉండి రికార్డు స్థాయిలో మహిళలను గమ్యస్థానాలకు చేర్చారని అభినందించారు.






