Supreme Court | మహిళ దుస్తులను పట్టుకొని లాగటం, వక్షోజాలను తాకడం కూడా అత్యాచార యత్నం కిందకు వస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఉత్తర ప్రదేశ్ లో నాలుగేళ్ల కిందట జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసులో తీర్పు వెలువరుస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
2021 నవంబరులో ఉత్తర్ ప్రదేశ్ లోని కస్గంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తోంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వారిని సమీపించి బాలికను ఇంటి దగ్గర దింపుతామని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు.
మార్గమధ్యంలో వారు బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె పైజామా దారాన్ని తెంచి, కాలువ కిందకు ఈడ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వ్యక్తులు అడ్డుకోవడంతో నిందితులు పారిపోయారు.
ట్రయల్ కోర్టు ఈ చర్యలను అత్యాచార యత్నంగా భావించి భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 376 (అత్యాచారం)తో పాటు Protection of Children from Sexual Offences Act కింద కేసు నమోదు చేసింది. అయితే Allahabad High Court ఈ ఆరోపణలు అత్యాచార యత్నానికి సరిపోవని పేర్కొంటూ కేసును IPC 354-B మరియు POCSO చట్టంలోని ఇతర సెక్షన్లకు మార్చింది.
ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన Supreme Court సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. హైకోర్టు అభిప్రాయంతో ఏకీభవించలేమని స్పష్టం చేసింది. ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీచేసింది. ఈ నేపథ్యంలోనే తాజా తీర్పు వెలువడింది.










