KCR Mourns Demise Of Former PM Manmohan Singh | భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ ( Manmohan Singh ) అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) హాజరై నివాళులర్పించనున్నది.
ఈ మేరకు బీఆరెస్ అధినేత కేసీఆర్ ( KCR ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )కు ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందం హాజరుకానున్నది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడుతూ..దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారన్నారు.
దాంతో పాటు తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం మన్మోహన్ సింగ్ తో ఉందని వారి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన తనకు వారితో వ్యక్తిగత అనుబంధముందని గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదు. తెలంగాణ కోసం పోరాడుతున్న తనకు, టీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారని, మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్ కి ఘన నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని కేసీఆర్ స్పష్టం చేశారు.