Karun Nair’s Cryptic Post Amid India’s Collapse Goes Viral | సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్టులో టీం ఇండియా ఆటగాళ్లు తెలిపోయారు. ఇదే సమయంలో క్రికెటర్ కరుణ్ నాయర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నాయర్ చేసిన నిగూఢమైన పోస్ట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలోని బర్సపరా స్టేడియం వేదికగా రెండవ టెస్టు కొనసాగుతుంది.
సౌత్ ఆఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 489 పరుగులు చేసింది. అయితే టీం ఇండియా మాత్రం కేవలం 201 పరుగులకే కుప్పకూలింది. జైస్వాల్ 58 పరుగులు చేయగా, వాషింగ్టన్ సుందర్ 48 పరుగులు, బౌలర్ కుల్దీప్ యాదవ్ 134 బంతులు ఆడి 19 పరుగులు చేసి టీం ఇండియాను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఇదే సమయంలో ఎక్స్ వేదికగా కరుణ్ నాయర్ చేసిన నిగూఢమైన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
‘కొన్ని పరిస్థితులు హృదయంలో లోతుగా పాతుకుపోయిన భావనను గుర్తుచేస్తాయి. అదే సమయంలో మనం అక్కడ లేము అనే నిశ్శబ్దం మరికొంత బాధను జోడిస్తుంది’ అని నాయర్ పేర్కొన్నారు. టీం ఇండియా కుప్పకూలిన సమయంలో తాను ఎంపిక కాకపోవడంపై నాయర్ నిరాశను వ్యక్తం చేస్తున్నారని పలువురు కామెంట్లు పెడుతున్నారు.










