Kalvakuntla Kavitha News | ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంకా పాత పద్ధతుల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ప్రసవ సమయంలో నొప్పులు తట్టుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్ లో ఇచ్చే ఎపిడ్యూరల్ మెడిసిన్ ను ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు విజ్ఞప్తి చేశారు.
జాగృతి జనం బాటలో భాగంగా కవిత నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతాశిశు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత డెలివరీ సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవ వేదనను భరించేందుకు ఎపిడ్యూరల్ అనే మెడిసిన్ ఇస్తారని ఆ మందును ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే డెలివరీల్లో సగం సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయని కానీ మరో సంగం డెలివరీలు మాత్రం ఆటవిక పద్ధతుల్లో ప్రసవ వేదనతోనే పిల్లల్ని కంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏ విధంగా అయితే ప్రసవం సమయంలో నొప్పిని తట్టుకునేందుకు ఎపిడ్యూరల్ మెడిసిన్ ఇస్తున్నారో అదే మందును ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవ్వాలని కోరారు. గత బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎపిడ్యూరల్ ప్రవేశపెట్టాలనే ఆలోచన తనకు రాలేదని అందుకు కవిత క్షమాపణలు చెప్పారు.










