Jupally Krishnarao News Latest | తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి శనివారం ఉట్నూర్ మండలం కుమ్మరికుంట ఆదివాసీ గూడాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో ముచ్చటించి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి ఒడిలో ఉన్న మినీ కాశ్మీర్ గా పిలిచే ఉమ్మడి ఆదిలాబాద్ ను చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారని కానీ ఇక్కడే పుట్టి పెరిగిన అడవి బిడ్డలకు ఆధునిక ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకపోవడం తనను కలచివేసిందని, అందుకే కుమ్మరికుంట గూడెం ఆదివాసీలను ప్రత్యేక బస్సుల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు తీసుకువెళ్తామని మంత్రి చెప్పారు.
నగరంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ఆకాశహర్మ్యాలు, మెట్రో రైళ్లు నగరవాసుల జీవన విధానాన్ని చూపిస్తామని మంత్రి ప్రకటించారు. యువతకి క్రీడల పట్ల ఆసక్తి పెంచేలా హైదరాబాద్ లో వారికి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటలను కూడా చూపిస్తామని పేర్కొన్నారు. ఆదివాసీలు కేవలం అడవికి పరిమితం కాకూడదాని, వారు బయటి ప్రపంచాన్ని చూడాలి, జ్ఞానంతో వారి బతుకులను, వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ పర్యటనకు అయ్యే రవాణా, భోజన, వసతి ఖర్చులన్నీ పర్యాటక, సాంస్కృతిక శాఖ భరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 వసంతాలు గడిచినా, నేటికీ ఆదివాసీ గూడాల్లో దుర్భర పరిస్థితులు కొనసాగడం విచారకరమని జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడకపోవడంపై అధికారులతో చర్చించి, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.









