India-Canada relations | కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్న సమయంలో భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. 2023లో ఖలిస్తాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత హస్తం ఉందని ట్రూడో ఆరోపణలు చేశారు.
వీటిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు తమ దౌత్యవేత్తలను వెనక్కు పంపించాయి. అయితే ట్రూడో తర్వాత మార్క్ కార్ని కెనడా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో తిరిగి భారత్-కెనడా సంబంధాలు బలపడే దిశగా అడుగులు పడుతున్నాయి.
కెనడా వేదికగా జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఆ దేశ ప్రధాని మార్క్ కార్ని-భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాల సంబంధాలు బలపడే దిశగా చర్చలు జరిగాయి. అత్యంత సానుకూలంగా చర్చలు జరిగినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు.
భేటీ సందర్భంగా దౌత్యవేత్తల పునర్ నియామకంపై ఏకాభిప్రాయం కుదిరింది. అలాగే నిలిచిపోయిన వాణిజ్య చర్చలపై కూడా ఇరు దేశాలాధినేతలు చర్చించారు. రెండు దేశాలు తమ హై కమిషనర్లను పునరుద్ధరించేందుకు అంగీకరించాయి.
భారత హైకమిషన్ కార్యాలయం కెనడాలో వీసా సేవలను పునఃప్రారంభించడాన్ని ఆ దేశం స్వాగతించింది. 2023 తర్వాత మొదటిసారి ఇరుదేశాల మధ్య దౌత్య సేవలు పూర్తిస్థాయిలో పునఃప్రారంభం కానున్నాయి.










