Husband-Wife Exchange In Meghalaya Assembly | వ్యక్తిగత జీవితం కంటే ప్రజా బాధ్యత ముఖ్యం అని నిరూపించిన ఘటన మేఘాలయ శాసనసభలో చోటుచేసుకుంది. వెటర్నరీ కాలేజీల పురోగతి గురించి సీఎంను నిలదీశారు ఓ ఎమ్మెల్యే. ఇందులో వింతేమి ఉంది అనుకోవద్దు. ఎందుకంటే వారిద్దరూ భార్యాభర్తలు కావడం విశేషం. మేఘాలయ శాసనసభలో గత మంగళవారం జరిగిన బడ్జెట్ సెషన్ సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా (ఎన్పీపీ)ను ఆయన భార్య, గాంబెగ్రే నియోజకవర్గ ఎమ్మెల్యే మెహతాబ్ చండీ సంగ్మా ప్రశ్నించారు. ‘సంగ్మా వర్సెస్ సంగ్మా’గా వైరల్ అయిన ఈ చర్చ నేటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే మెహతాబ్ మాట్లాడుతూ..2022లో కేబినెట్ ఆమోదించిన పశుసంవర్ధక విద్యా ప్రాజెక్టుల పురోగతి గురించి సీఎంను నిలదీశారు.
వెటర్నరీ కాలేజీ, రెండు ఫిషరీస్ కాలేజీలు, ఒక డెయిరీ కాలేజీల పనులు ఎందుకు ఆగిపోయాయని, వెటర్నరీ ట్రైనింగ్ సెంటర్లలో సిబ్బంది కొరత గురించి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో భర్త అయిన సీఎం కాన్రాడ్ సంగ్మా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఆయనే పశుసంవర్ధక శాఖ కూడా చూస్తున్నారు. పశుసంవర్ధక రంగంలో రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఆధారపడతారు కాబట్టి ఈ కాలేజీలు అవసరం అని తెలిపారు. రి-భోయ్ జిల్లాలో 800 ఎకరాలు గుర్తించి, రూ.334 కోట్లతో 19 విభాగాలతో వెటర్నరీ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆర్థిక భారం ఎక్కువైనా ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని సభకు హామీ ఇచ్చారు. ఇలా భార్యాభర్తలైన ఈ ఇద్దరు అగ్ర నేతలు చర్చించుకుంటున్న సమయంలో సభలో నవ్వులు విరబుసాయి.










