Harish Rao Sensational Comments On CM Revanth Reddy | అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పన్నారు. అందుకే శనివారం ముఖ్యమంత్రి స్పీచ్ ను బహిష్కరించినట్లు చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీనని విమర్శించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల 299 టీఎంసీల నీటి పంపకాలు చేశారని, 299 టిఎంసీల నీటి వినియోగం కంటే ఎక్కువ ప్రాజెక్టులు లేవని తెలిపారు.
తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి.. 299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారని, ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్ దే అంటూ హరీష్ మండిపడ్డారు. పొతిరెడ్డిపాడు కోసం పీజేఆర్ కొట్లాడారని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం పదవుల కోసం పెదవులు మూసుకున్నారని విమర్శించారు.
ఉత్తమ్ చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చారని.. కృష్ణ నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు.