Harish Rao News Latest | రేవంతు ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన SLBC టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయ్యాయని, అయినా ప్రభుత్వ సహాయక చర్యల్లో పురోగతి లేదని విమర్శించారు మాజీ మంత్రి, బీఆరెస్ నేత హరీష్ రావు. ఇది అత్యంత బాధాకరమైన సందర్భమన్నారు.
తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలు పెట్టుకొని టన్నెల్ వద్దనే ఉండి రోధిస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య వేదన అవుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలను ప్రశ్నార్థకం చేసిందని వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని అన్నారు.
టన్నెల్ లో చిక్కుకున్న వారిని కాపాడడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇద్దరి మృతదేహాలను వెలికి తీసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి, యావత్ దేశం వారిని క్షేమంగా బయటికి తీసుకొస్తారని ఆశగా ఎదురు చూస్తే, ముఖ్యమంత్రి ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు.
పబ్లిసిటీ కోసం టన్నెల్ వద్దకు వెళ్ళి రావడం తప్ప ఇప్పటి వరకు చేసిందేం లేదని ఒకసారి సమీక్ష చేయడం తప్ప చిత్తశుద్ధితో పరిష్కార మార్గం కోసం ప్రయత్నించింది లేదని మండిపడ్డారు. హెలికాప్టర్ లో వెళ్ళి మంత్రులు పెట్టిన డేట్లు మారాయి తప్ప, ఇప్పటి వరకు ఒక్కరిని ప్రాణాలతో బయటకు తెచ్చింది లేదని తెలిపారు.
సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పి ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారు? లోపల చిక్కుకున్న ఆరుగురి పరిస్థితి ఏమిటి? అంటూ ప్రభుత్వాన్ని హరీష్ ప్రశ్నించారు. కూటి కోసం, కూలీ కోసం తెలంగాణకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.