Deputy Cm Pawan Kalyan News | జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.
అడవులను, వన్యప్రాణులను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను అర్పించినవారిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని, వారి ధైర్య సాహసాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అని పవన్ పేర్కొన్నారు. వారి త్యాగం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.
జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల అటవీ అధికారుల కుటుంబాల సంక్షేమం కోసం రూ. 5 కోట్లు నిధులను కూటమి ప్రభుత్వం జమ చేయడం జరిగిందని వెల్లడించారు.
దీనికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి డిప్యూటీ సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అటవీ రక్షకుల భద్రత కోసం ఆధునిక ఆయుధాలు, రక్షణ సామాగ్రి, కమ్యూనికేషన్ సదుపాయాలు, వాహనాలను అందించడంతోపాటు, అత్యవసర పరిస్థితుల్లో స్వీయరక్షణ, అక్రమ కార్యకలాపాలను ఎదుర్కోవడం, సవాళ్లను అధిగమించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.










