Cm Revanth Reddy News | ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న ఆదరణ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు భారీగా పెరిగాయి.
వీటికి సంబంధించిన వార్త కథనాలను ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పదేళ్ల చీకట్లను పారదోలి ప్రభుత్వ పాఠశాలల్లో అక్షర జ్యోతులు వెలుగుతున్నాయని పేర్కొన్నారు. పేద బిడ్డల చదువుల గుడులు అక్షర మంత్రోశ్ఛారణలతో పవిత్రతను సంతరించుకున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
సర్కారు బడికి గత పాలకులు వేసిన తాళాలు బద్ధలవుతున్నాయన్నారు. పాఠశాలల్లో కనిపిస్తోన్న ఈ గుణాత్మక మార్పు తెలంగాణ భవిష్యత్ గమనానికి సంకేతమని తెలిపారు.
ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని పోస్టు చేశారు. ఈ అక్షర యజ్ఞంలో చేతులు కలిపిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.










