India’s first bullet train gets launch date | భారతదేశంలో బులెట్ ట్రైన్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. నూతన సంవత్సర తొలిరోజు కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వందే భారత్ స్లీపర్ రైలు గురించి ముఖ్యమైన ప్రకటన చేశారు. జనవరి నెలలోనే ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుందన్నారు. వీటి టికెట్ ధరలు విమాన టికెట్ రేట్ల కంటే తక్కువగానే ఉంటాయన్నారు. ఇప్పటికే వందే భారత్ స్లీపర్ ట్రైన్ కు సంబంధించి ట్రయల్స్, సర్టిఫికేషన్ కూడా పూర్తయ్యిందని వెల్లడించారు.
గువాహటి-కోల్కత్త మధ్య మొదటి సర్వీస్ నడుస్తుందని, ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ఈ రైలును అతి త్వరలో ప్రారంభిస్తారని కేంద్రమంత్రి ప్రకటించారు. 180 కి.మీ. వేగంతో నిర్వహించిన ట్రయల్స్ విజయవంతం అయిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే సమయంలో బులెట్ ట్రైన్ గురించి మీడియా ప్రశ్నించగా వచ్చే ఏడాది అంటే 2027 ఆగస్ట్ 15 వరకు బులెట్ రైలు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందన్నారు. ముంబయి-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ లో భాగంగా బులెట్ ట్రైన్ వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు.










