Nara Lokesh News | ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనను ముగించుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో గురువారం మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతమైందని, ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే పెట్టుబడులను ఏపీకి రాకుండా అడ్డుకోవాలని ఓ వ్యక్తి ఏకంగా సింగపూర్ అధికారులకు ఈ-మెయిల్స్ పంపాడని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అస్థిర ప్రభుత్వం ఉందని, అది ఏ క్షణమైనా పడిపోవచ్చని ఈ మెయిల్స్ లో సదరు వ్యక్తి రాసినట్లు మంత్రి చెప్పారు. రేపోమాపో ప్రభుత్వం పడిపోతుంది, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు అని ఈ మెయిల్స్ పంపినట్లు లోకేశ్ మీడియాకు వెల్లడించారు. సింగపూర్ అధికారులకు ఈ మెయిల్స్ పంపిన వ్యక్తి పేరు మురళి కృష్ణ అని పేర్కొన్నారు.
ఇతను మాజీ మంత్రి, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన ఓ సంస్థ ఉద్యోగులతో నిరంతరం మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలతో సైతం సంభాషించినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా జగన్ పార్టీ కుట్రలు చేస్తుందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు.










