Ys Sharmila News Latest | కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ( Ys Sharmila ) తీవ్రంగా స్పందించారు.
అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని YCP పాలన ఓ విపత్తు అయితే.. 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే.. ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా? అని నిలదీశారు.
ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా ? అంటూ అమిత్ షా ను ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా ? సొంత బాబాయి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. కేంద్ర హోం శాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారు? అని ప్రశ్నించారు.
‘5 ఏళ్లపాటు జగన్ మీకు దత్తపుత్రుడు, ఆడించినట్లు ఆడే తోలుబొమ్మ, పార్లమెంట్లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్ రాష్ట్రంలో సహజ వనరులను ‘మోదానీ’కి దోచిపెట్టే ఏజెంట్ ( Agent ). మీ ఇష్టారాజ్యంగా 5 ఏళ్లు వైసీపీనీ వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారు. 10 ఏళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి, ఇప్పుడు అండగా ఉంటాం. రూ.3లక్షల కోట్లు ఇస్తాం, పూర్వవైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనం’ అని షర్మిల అమిత్ షా ను ఉద్దేశించి ధ్వజమెత్తారు.