Telangana BC panel seeks reports over infant’s death | జిల్లా కేంద్రం అయిన నాగర్ కర్నూల్ మండలంలో కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో రెండు నెలల చిన్నారి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ జాతర సమయంలో రజక సామాజిక వర్గానికి చెందిన బాధిత కుటుంబంపై కుల వివక్ష, ఆలయంలోకి ప్రవేశించించకుండా నిరాకరించడం వంటి ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో కుమ్మెర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి దుర్మరణం అని వచ్చిన కథనాలపై రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ స్పందించారు. కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక అందించాలని ఎండోమెంట్ శాఖ కమిషనర్ హరీష్ కు లేఖ రాశారు.
కుల వివక్ష, బీసీ వర్గాల వారికి ఆలయంలోకి ప్రవేశించకుండా నిరాకరించడంతో జరిగిన ఘర్షణలో రెండు నెలల చిన్నారి మృతి చెందడంపై పూర్తి నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ ఛైర్మన్ కోరారు. ఘర్షణ ఘటనకు దారి తీసిన పరిస్థితులు, కుల వివక్ష, జాతరలో ప్రవేశ రుసుము వసూలు అలాగే జాతర కోసం ఎండోమెంట్స్ శాఖ చేసిన ఏర్పాట్లపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను మూడు రోజుల్లో సమర్పించాలన్నారు.










