Pawan Kalyan Reviews Cyclone Relief | మొంథా తుఫాన్ నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని ప్రజలను అధికార యంత్రాంగ పునరావాస కేంద్రాలకు తరలించింది. దింతో భారీగా ప్రాణ నష్టం తప్పింది. మొంథా తీరం దాటినా ఆ ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన విధంగా అధికార యంత్రాంగం నిత్యావసరాలను సమకూర్చిందని చెప్పారు. బియ్యం 25 కేజీలు మత్స్యకారులకు, చేనేత కార్మికులకు 50 కేజీలు, కందిపప్పు కేజీ, పామాయిల్ ఒక లీటర్, ఉల్లిపాయలు కేజీ, బంగాళాదుంపలు కేజీ, పంచదార కేజీ చొప్పున అధికారులు అందిస్తారని పేర్కొన్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలను అనుసరించి ఆ శాఖ అధికార యంత్రాంగం అన్ని రేషన్ షాపులకు వీటిని చేర్చిందన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 14,415 రేషన్ షాపుల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3424 మెట్రిక్ టన్నుల పంచదారతోపాటు ఇతర నిత్యావసరాలను పంపిణీకి సిద్ధంగా ఉంచారని వివరించారు.









