Owaisi calls Pakistan a ‘failed nation’ | పాకిస్థాన్ భారతదేశాన్ని ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వదని పేర్కొన్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. పాక్ ఓ విఫల దేశమన్నారు. బీహార్లోని కిసాన్గంజ్లో శనివారం జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీ పాకిస్థాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ ఒక విఫల దేశమని, అది భారత్ను ఎప్పుడూ శాంతియుతంగా ఉండనీయదని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి వంటి ఘటనలకు పాకిస్థాన్నే బాధ్యత వహించాలని, ఇలాంటి దాడులను ప్రోత్సహించే విధానాలను ఆ దేశం మానుకోవాలని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, వారిని భారత్లోకి పంపడం వంటి చర్యల ద్వారా దక్షిణాసియాలో అశాంతిని సృష్టిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్ను గ్రే లిస్ట్లో ఉంచేలా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.
పాక్ ముస్లిం వర్గాల్లో శాంతి నెలకొల్పలేని ఈ ఫెయిల్డ్ కంట్రీ అన్నారు. పొరుగు దేశాలైన ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు నెరపలేని విఫల దేశం పాకిస్థాన్ అని దుయ్యబట్టారు. పాక్ తో పోల్చితే భారత్ ఎప్పటికీ బలమైన దేశమేనని తెలిపారు. భారత ముస్లింలు 1947లోనే జిన్నాను తిరస్కరించారని ఒవైసీ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న దౌత్య నిర్ణయాలను ఒవైసీ అభినందించారు. అలాగే ఈ తరుణంలో భారత్ పాక్ కు గట్టి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. పాక్ కు వ్యతిరేకంగా ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకున్న తమ మద్దతు ఉంటుందని ఒవైసీ స్పష్టం చేశారు.