Netaji’s aide coined the slogan Jai Hind | జైహింద్. ఉద్వేగభరితమైన ప్రతి ప్రసంగంలో చివర వినిపించే నినాదం. జైహింద్ అనే పదం వినగానే ఎక్కువగా గుర్తొచ్చే పేరు స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్. దేశ భక్తికి ప్రతీకగా మారిన ఈ జైహింద్ అనే పదం సృష్టి వెనక ఒక ఆసక్తికర కథ ఉంది.
స్వాతంత్య్రం కంటే పూర్వం నిజాం పాలిస్తున్న తెలంగాణ ప్రాంతంలో జన్మించిన ఓ యువకుడు జైహింద్ నినాద వాస్తవ సృష్టికర్త. జై హింద్ అంటే హిందూస్థాన్ కు జయం కలుగు గాక అని అర్థం. ఈ జైహింద్ సృష్టికర్త ఆబిద్ హసన్ సఫ్రానీ. అసలు పేరు జైనుల్ ఆబిదీన్ హసన్. 1911 ఏప్రిల్ 11న హైదరాబాద్ లో జన్మించారు. ఆబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో చదివారు.
ఆయన తల్లి హాజియా బేగం. ఆమె బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత, సరోజిని నాయుడుకు స్నేహితురాలు. ఇంజనీరింగ్ విద్య కోసం జర్మనీ వెళ్లిన ఆబిడ్ హసన్ సఫ్రానీ అక్కడే నేతాజీ సుభాష్ ను తొలిసారి కలుసుకున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం బోస్ చేస్తున్న కృషి, ఆయన ప్రసంగాలు సఫ్రానీ నీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
దీంతో చదువును మధ్యలోనే వదిలేసి బోస్ కు వ్యక్తిగత కార్యదర్శిగా, జర్మనీ బాషా అనువాదుకడిగా చేరారు. బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మిలో మేజర్ గా పనిచేశారు. బ్రిటన్ తో జర్మనీ యుద్ధం చేస్తున్న సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మిలో భిన్న నేపథ్యం ఉన్న వారు ఉండేవారు. నమస్కార్, రాంరాం, సత్ శ్రీ అకాల్, అస్సలాం అలైకుం అంటూ అభివాదం చేసుకునే వారు.
సెక్యులర్ బోస్ కు ఇది నచ్చేది కాదు. అందరికీ నచ్చేలా ఓ అభివాద నినాదాన్ని రూపొందించాలని సహచరులకు సూచించారు. ఆబిద్ హసన్ తొలుత ‘హలో’ అని ప్రతిపాదించారు. అయితే ఇది బోస్ కు నచ్చలేదు. అనంతరం జై హిందూస్తాన్, జై హింద్ అని ప్రతిపాదించారు.
జై హిందూస్తాన్ కాస్త పెద్దదిగా ఉండడంతో, బోస్ జై హింద్ కు జై కొట్టారు. అనంతరం జై హింద్ అనే నినాదాన్ని బోస్ ప్యాచుర్యంలోకి తీసుకువచ్చారు. అప్పటినుంచి ఇది దేశభక్తికి ప్రతీకగా మారింది. 1984 ఏప్రిల్ 5న ఆబిడ్ హసన్ హైదరాబాద్లో కన్నుమూశారు.