Nara Lokesh News | ఏపీలో అభివృద్ధి చెందుతున్న ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్ డ్ టెక్నాలజీస్ లో యువతకు శిక్షణ ఇచ్చి, వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేయడానికి ప్రఖ్యాత సంస్థ ఒరాకిల్ తో ఏపీఎస్ఎస్ డీసీ కీలక ఒప్పందం చేసుకోవడం జరిగిందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
ఈ ఒప్పందం ద్వారా యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్ స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుందని తెలిపారు. మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతలో ఒరాకిల్ క్లౌడ్ నైపుణ్యాల కోసం చేయూత అందించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశమని వెల్లడించారు.
మూడేళ్లలో మొత్తం 4లక్షలమందికి ఒరాకిల్ మై లెర్న్ డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా శిక్షణ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి స్నైడర్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.
ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందుపుచ్చుకునేందుకు ప్రతిభావంతులైన బృందాలను తయారు చేయడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు.
ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి, 2027వరకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, NAC శిక్షణా కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్ ల ఏర్పాటు ద్వారా ప్రపంచస్థాయి ప్రమాణాలతో 9వేల మంది యువతకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.