Nagababu Latest News | అక్రమ వలసదారులు, రోహింగ్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. అక్రమ వలసదారుల వలన రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి గ్రామంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఒకవ్యక్తి వద్ద 15 రౌండ్ల తుపాకీ బుల్లెట్లు స్వాధీనం చేసుకుని, అతన్ని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఘటన భద్రతా లోపాలను సూచిస్తోందన్నారు. రోహింగ్య వలసదారులు 2017-18 నుంచే రాష్ట్రానికి వస్తున్నారని, కోస్టల్ ప్రాంతాల్లో అక్రమంగా ఆధార్ మరియు రేషన్ కార్డు పొందినట్లు వచ్చిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
అక్రమ వలసదారుల అంశాన్ని కేవలం శరణార్థుల సమస్యగా చూడొద్దని ఇది భవిష్యత్తులో అనేక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. తీరప్రాంతాలు విస్తారంగా ఉన్న రాష్ట్రంలో చొరబాటు ప్రమాదం కూడా అధికంగా ఉందని పడవల ద్వారా గుర్తింపు లేని వ్యక్తుల ప్రవేశం, స్మగ్లింగ్ మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు అవకాశాలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వలసదారుల ద్వారా హవాలా, అక్రమ ఆయుధాల సరఫరా జరిగే ప్రమాదం ఉందని అలాగే కీలక ఆస్తులపై భద్రతా పరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.










