– ఆవిష్కరించిన మంత్రి సీతక్క!
- మేడారం జాతరకు అంతర్జాతీయ వారసత్వ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాం
Medaram Jathara Coffee Table Book | జ్యోతి రావు పూలే ప్రజాభవన్లో నిర్వహించిన శుక్రవారం నాడు “Goddess of Folk – Sammakka Saralamma Jatara” కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క (Minister Seethakka) ముఖ్య అతిథిగా హాజరై కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాఫీ టేబుల్ పుస్తకాన్ని రూపొందించిన కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ను మంత్రి సీతక్క అభినందించారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదివాసుల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు.
వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా రామప్ప దేవాలయానికి గుర్తింపు దక్కడం తెలంగాణకు గర్వకారణమని, ఆ గుర్తింపు సాధనలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కీలక పాత్ర పోషించిందని మంత్రి తెలిపారు.
అదే విధంగా లివింగ్ హెరిటేజ్ విభాగంలో ఇప్పటికే బెంగాల్లో దుర్గా పూజ, దిపావాళి పండుగలకు హెరిటేజ్ హోదా లభించిన నేపథ్యంలో, మేడారం జాతరకు కూడా అంతర్జాతీయ వారసత్వ గుర్తింపు తీసుకొచ్చేలా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ఈ దిశగా చరిత్రకారులు, సామాజికవేత్తలు, అనుభవజ్ఞులు, అంత్రోపాలజిస్టులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
సమ్మక్క–సారలమ్మల త్యాగగాథ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిందని, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను తరతరాలు స్మరించుకుంటాయని మంత్రి అన్నారు.
ప్రతి పండుగ ప్రత్యేకత కలిగి ఉన్నప్పటికీ, మేడారం జాతర తన ప్రత్యేక వైభవంతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. కోయ జాతి బిడ్డగా మేడారం చరిత్రలో భాగస్వామ్యం కావడం తనకు గర్వకారణమని తెలిపారు.
మేడారం జాతర అరుదైన చిత్రాలను సంకలనం చేసి కాఫీ టేబుల్ బుక్ రూపంలో తీసుకువచ్చిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్కు మంత్రి అభినందనలు తెలిపారు.
ఈ గ్రంథంలోని ప్రతి చిత్రం ఒక చరిత్రను ప్రతిబింబిస్తోందని, ప్రపంచ పటంలో మేడారాన్ని నిలబెట్టిన ఫోటోగ్రాఫర్ల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న కాకతీయ హెరిటేజ్ సభ్యులు, ఫోటోగ్రాఫర్లను మంత్రి శాలువాలతో సత్కరించారు.
కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకుడు కాఫిటేబుల్ బుక్ ఎడిటర్ బి. నర్సింగరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు బి.వి. పాపారావు, బి.పి. ఆచార్య, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. రతన్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ట్రస్టీ ప్రొఫెసర్ ఎం. పాండు రంగారావు, జె. శ్రీధర్ రావు తదితరులు హాజయ్యారు.
మేడారం కాఫీ టెబుల్ బుక్ కి తమ అద్భుత చిత్రాలతో తోడ్పాటునిచ్చిన ప్రముఖ పేయింటర్ ఏలే లక్ష్మణ్, ఫోటోగ్రాఫర్లు రామ వీరేశ్ బాబు, పి. విజయ భాస్కర్ రెడ్డి, శరత్ బాబు, డి.ఎం. అర్జున్, శ్రీశైలం, అన్నవరం శ్రీనివాస్, సృజన్ పున్న, అనుమల్ల గంగాధర్, సత్యనారాయణ గొల్ల, డి. రవీందర్ రెడ్డి, కందుకూరి రమేష్ బాబు, వినీద్ బాబు వి, బిలుక ప్రభాకర్, ఎన్.ఆర్. సుధాకర్ గౌడ్ సేవలను కొనియాడారు. వారి ఫోటోలు జాతర వైభవాన్ని సజీవంగా ఆవిష్కరించాయని ప్రశంసించారు.










