Free Bus Journey For Women | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు రవాణా పథకం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో బుధవారం గుంటూరులోని ఎన్టీఆర్ బస్ స్టేషన్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ ఎండీ ద్వారా తిరుమల రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదో ఒక ఐడీ కార్డుతో మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. రాష్ట్ర మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుడుతోందని వెల్లడించారు.
ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వచ్చే ఉచిత బస్సు సర్వీసు ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
ఎక్స్ ప్రెస్ బస్సులతోపాటు నగరాల్లోని మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. వచ్చే క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ అంశంపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముందని తెలిపారు.









