Kerala to become ‘Keralam’ | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ‘కేరళ’ పేరును ‘కేరళం’ గా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. తమ రాష్ట్ర పేరును కేరళ నుంచి కేరళం గా మార్చాలని ఆ రాష్ట్ర శాసనసభ 2024 జూన్ 24న ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాజ్యాంగం మొదటి షెడ్యూల్ లో కేరళ గా ఉన్న పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
హోంమంత్రిత్వ శాఖ పరిశీలన తర్వాత కేరళ పేరు మార్పు ప్రతిపాదన కేబినెట్ దృషికి వచ్చింది. కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ‘కేరళ (ఆల్టరేషన్ ఆఫ్ నేమ్) బిల్, 2026’ ను రాష్ట్రపతి కేరళ శాసనసభకు పంపి అభిప్రాయాలు కోరుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి సిఫార్సుతో పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే కేరళ పేరు కేరళంగా మారుతుంది.










