Hyderabad Metro Will Be Handed Over To Telangana Govt By March | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1ను పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, మార్చి 31లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఫేజ్ 2 పనులను కేంద్ర ప్రభుత్వ వాటాతో చేపట్టాలని నిర్ణయించింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు.
హైదరాబాద్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు అవసరమైన 42 ఎకరాలను రక్షణ శాఖ నుంచి తీసుకున్నందున సమాన విలువైన భూములు కింద రక్షణ శాఖకు కాప్రా మండలంలో 153 ఎకరాలు బదలాయింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోకి వికారాబాద్ జిల్లాలోని నవాబ్ పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్ పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను చేర్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, మార్చి 16 నుంచి 30 వరకు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరపనున్నట్లు మార్చి 20న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు.










