- లాగౌట్ చేయకుంటే కొంప మునిగినట్లే!
Whatsapp Impersonation Fraud | కార్పొరేట్ కంపెనీలు మరియు బడా వ్యాపార సంస్థలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త ‘వాట్సాప్ ఇంపర్సనేషన్ ఫ్రాడ్’ (Whatsapp Impersonation Fraud) కు తెరలేపారని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ప్రజలను అప్రమత్తం చేశారు.
సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓలు మరియు అకౌంటెంట్లను టార్గెట్ చేస్తూ ఈ మోసాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.
ముఖ్యంగా ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ వాడేవారు పని ముగిసిన తర్వాత లాగౌట్ చేయడం మర్చిపోకూడదని, లేదంటే సైబర్ దొంగల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Read Also: ‘పోలీస్ మామలు’ వాట్సప్ గ్రూప్..అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ఎస్ఐ!
ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు నమోదు కావడంతో పోలీసులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మోసం జరిగే తీరు చాలా భయంకరంగా ఉంటోంది.
ముందుగా సంస్థల అధికారిక ఈమెయిల్స్కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లలోకి ‘మాల్వేర్’ను ప్రవేశపెడుతున్నారు.
దీనివల్ల ఆ సిస్టమ్స్ పై వారికి పూర్తి స్థాయి రిమోట్ యాక్సెస్ లభిస్తుంది. అప్పటికే ఆ కంప్యూటర్లో యాక్టివ్గా ఉన్న ‘వాట్సాప్ వెబ్’ సెషన్లను ఉపయోగించుకుని, సీఈఓ లేదా సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు అత్యవసరంగా డబ్బు బదిలీ చేయాలంటూ సందేశాలు పంపిస్తున్నారు.
పై అధికారులే అడిగారని భావించిన అకౌంటెంట్లు సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలకు చిక్కి క్షణాల్లో రూ.కోట్ల మొత్తాన్ని సైబర్ నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేస్తున్నారని సజ్జనర్ తెలిపారు.
Read Also: చెన్నై మెరీనా బీచ్ లో స్మార్ట్ మెషిన్.. ప్లాస్టిక్ ఇస్తే ఏం ఇస్తుందో తెలుసా!
ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి కంపెనీ అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. వాట్సాప్లో పై అధికారుల పేరుతో వచ్చే ఎటువంటి ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదని, వెంటనే వారికి నేరుగా ఫోన్ చేసి ఆ మెసేజ్ నిజమేనా కాదా అని ధృవీకరించుకోవాలని పేర్కొన్నారు.
ఆఫీసు సిస్టమ్స్లో నాణ్యమైన ఫైర్వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోవడంతో పాటు, వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పకుండా లాగౌట్ చేయాలని స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే అవగాహనే సరైన ఆయుధమని ఆయన అభిప్రాయపడ్డారు.









