Hung Verdict Triggers Intense Race In Jangaon Municipality | తెలంగాణ కార్పోరేషన్ల, మున్సిపల్ మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నికలు సోమవారం జరిగాయి. హాంగ్ ఏర్పడిన పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో 11 మున్సిపాలిటీల ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇందులో భాగంగా జనగామ మున్సిపాలిటి ఛైర్మన్ ఎన్నిక కూడా వాయిదా పడింది. ఈ మున్సిపాలిటీ రాజకీయం ఫలితాలు వెలువడిన నాటి నుండి రసవత్తరంగా మారాయి. 30 వార్డులున్న జనగామలో కాంగ్రెస్-సీపీఎం కూటమి 13, బీఆరెస్ 13, ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు. దింతో మేజిక్ ఫిగర్ ఎవరికీ దక్కలేదు. అలాగే స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఎక్స్ ఆఫీషియో ఓటు ఇక్కడే నమోదు చేసుకోవడంతో ఇరు పక్షాలకు సమాన బలం ఉంది.
దింతో ఫలితం ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఛైర్ పర్సన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే పల్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గూండాలకు పోలీసులు, అధికారులు వంత పాడుతున్నారని, పూర్తి కోరం ఉన్నా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్నిక వాయిదా వేశారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిరసన తెలిపారు.










