Ganges River dolphins | గంగానదిలో డాల్ఫిన్లు నది పునరుజ్జీవనానికి సంకేతాలు శుభసూచకాలు అని నమామి గంగే పేర్కొంది. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలో గంగా నదిని శుద్ధి చేయడానికి ‘నమామే గంగా ప్రాజెక్టు’ కొనసాగుతుంది. తాజగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. హూగ్లీ నదిలో గంగానది డాల్ఫిన్లు ఈ మధ్య కాలంలో తరచుగా కనిపిస్తున్నాయన్నారు. ఒక నది మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందన్నారు. ఈ సాధు జంతువులకు కళ్ళు సరిగ్గా కనిపించవు, ఇవి కేవలం స్వచ్ఛమైన, ఆక్సిజన్ ఎక్కువగా ఉండే నీటిలో మరియు చేపలు సమృద్ధిగా ఉన్న చోట మాత్రమే జీవించగలవని చెప్పారు.
గడిచిన కొన్నేళ్లుగా క్షేత్రస్థాయిలో నిరంతరం తీసుకుంటున్న చర్యల వల్ల కాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గాయని వెల్లడించారు. 2018లో 12 mg/L ఉండే BoD స్థాయి నేడు 3 mg/L కంటే తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 32 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (STPs) పనిచేస్తున్నాయని వీటి ద్వారా ప్రతిరోజూ 554 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే నదిలోకి వదులుతున్నట్లు తెలిపారు. ప్రకృతి తనదైన శైలిలో స్పందిస్తూ, తిరిగి తన ఉనికిని చాటుకుంటోందజి ఫరక్కా నుండి డైమండ్ హార్బర్ వరకు, పరిశుభ్రమైన నదీ తీరాలు పర్యావరణ వ్యవస్థను పునర్నిర్మిస్తూ, వన్యప్రాణులకు అండగా నిలుస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.









