Don’t want you building in India, Trump tells Apple CEO Tim Cook | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కారు. ప్రముఖ ఐ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ను భారత్ లో కాకుండా అమెరికా పెట్టుబడులు పెట్టాలని చెప్పడం సంచలనంగా మారింది.
ఆపిల్ సీఈవో టిమ్ కుక్తో ఖతార్లో జరిగిన భేటీ సందర్భంగా, ట్రంప్ ఆపిల్ కంపెనీని భారతదేశంలో ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పకుండా, బదులుగా అమెరికాలోనే తయారీని పెంచాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు భారతదేశంలో “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమం కింద ఆపిల్తో జరుగుతున్న పెట్టుబడి చర్చలకు సవాలుగా మారాయి.
భారతదేశం అమెరికా ఉత్పత్తులపై అత్యధిక టారిఫ్లు విధిస్తోందని, దీని కారణంగా ఆపిల్ వంటి కంపెనీలు భారతదేశంలో తయారీ చేయడం కంటే అమెరికాలోనే ఉత్పత్తి చేయడం మంచిదని పేర్కొన్నారు. “నేను టిమ్ కుక్తో మాట్లాడాను, భారతదేశంలో ఆపిల్ ఉత్పత్తులు తయారు చేయవద్దని చెప్పాను.
భారత్లో అత్యధిక టారిఫ్లు ఉన్నాయి. భారతీయులు తమ దేశాన్ని తాము చూసుకోగలరు, కానీ నీవు అమెరికాలో తయారీ చేయాలని చెప్పాను. దీనికి టిమ్ కుక్ అంగీకరించారు” అని ట్రంప్ ఖతార్ వేదికగా వెల్లడించారు.
కాగా అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో యాపిల్ సంస్థ అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా భారత్ లో తయారీ కర్మాగారాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. భారత్ లో తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేయాలని భావించింది. కానీ ట్రంప్ యాపిల్ ను భారత్ లో పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పడం తీవ్ర చర్చకు దారి తీసింది.