Deputy Cm Pawan Kalyan News | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కీలక విజ్ఞప్తి చేశారు.
అధికారం చేపట్టిన రోజు నుండి ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో, కేంద్ర సహాయ, సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్ళవద్దని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే, దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లిబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దన్నారు.
తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయనని తెలిపారు. తనకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవటం, వారికి అండగా నిలబడటం, పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమేనన్నారు.
ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్ధం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసిన పవన్, మార్చ్ 14 న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాలు గురించి సమగ్రంగా చర్చించుకుందామని జనసైనికులకు స్పష్టం చేశారు.