CM Stalin Demands Constitution Amendments | తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (CM Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించి సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే నిర్మాణాత్మక పునర్నిర్మాణం అవసరమని పేర్కొన్నారు.
కేంద్రం అన్ని అధికారాలను తన వద్దే కేంద్రీకరించుకుందని ఆరోపించారు. దీంతో చట్టబద్ధంగా రావాల్సిన నిధుల కోసం కూడా రాష్ట్రాలు పోరాడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై Kurian Joseph కమిటీ నివేదిక మొదటి భాగాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతూ సీఎం స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ లాంటి వైవిధ్యం ఉన్న దేశానికి సమాఖ్య వ్యవస్థ పునాది లాంటిందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. “సామాజిక న్యాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల్లో పురోగతి సాధించినప్పటికీ, ఇంకా కొన్ని హక్కులు, నిధుల కోసం తలవంచి అడగాల్సిన పరిస్థితి సరైంది కాదు.
రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని అందించేందుకు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని సవరించాలి. ఇప్పటికీ మనకు వచ్చే రాజ్యాంగ హక్కులు, నిధులు, అధికారాల కోసం పోరాడాల్సిన స్థితిలో ఉన్నాం. అందుకే భారతదేశ సమాఖ్య వ్యసస్థకు నిర్మాణాత్మక పునర్ నిర్మాణం అవసరం.
మనం కోరుకుంటే, మళ్లీ రాజ్యాంగాన్ని సవరించవచ్చు. సమాఖ్యవాదం అంటే నియంత్రణ కాదు, నమ్మకం, స్వయంప్రతిపత్తి.” అన్నారు స్టాలిన్. 1967లోనే C. N. Annadurai బలమైన కేంద్రంతో పాటు రాష్ట్ర హక్కులను ప్రస్తావించారని, అనంతరం M. Karunanidhi కూడా అదే సూత్రాన్ని ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. గత ఏడాది ఏప్రిల్ 15న జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.










