BRS MLA Jagadish Reddy Suspended from Assembly Budget Session | శాసనసభ నుండి బీఆరెస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్, జగదీష్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ‘ఈ సభ అందరిదీ..సభ్యులందరూ సమానమే, అందరీ తరఫున పెద్ద మనిషిగా మాత్రమే మీరు అక్కడ కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’ అంటూ జగదీష్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సభా సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని జగదీష్ రెడ్డిపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు స్పీకర్ ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆక్షేపనీయమని, ఆయన్ను వెంటనే సభ నుండి సస్పెండ్ చేయాలని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు.
స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆరెస్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీతక్క ప్రతిపాదించారు. అలాగే స్పీకర్ ను అవమానించిన జగదీష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరో మంత్రి ఉత్తమ్ కోరారు.
ఈ నేపథ్యంలో బడ్జెట్ సెషన్ ముగిసే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రతిపాదించగా స్పీకర్ ఆమోదించారు. జగదీష్ రెడ్డి సభ నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఛాంబర్ లో కూర్చున్న జగదీష్ రెడ్డి వద్దకు వచ్చిన చీఫ్ మార్షల్ సభ నుండి వెళ్లిపోవాలని సూచించారు.