Bangladesh refuse to travel to India for 2026 T20 World Cup | టీ-20 వరల్డ్ కప్ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ వేదికగా ఆడాల్సిన లీగ్ మ్యాచుల వేదికను శ్రీలంకకు మార్చాలని కోరుతూ ఐసీసీ కి లేఖ రాయాలని ఆ దేశ క్రికెట్ బోర్డును ఆదేశించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్లు ఆదివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీ-20 వరల్డ్ కప్ లో బంగ్లా ఆడే లీగ్ మ్యాచుల వేదికను శ్రీలంకకు మార్చాలని కోరుతూ బీసీబీ ఐసీసీని కోరింది. కాగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఆ దేశంలోని మైనారిటీలు అయిన హిందువులపై దాడులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ ఆడడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ క్రమంలో ముస్తాఫిజుర్ ను రిలీజ్ చేయాలని కోల్కత్త నైట్ రైడర్స్ జట్టును బీసీసీఐ ఆదేశించింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ ఆక్షన్ లో ముస్తాఫిజుర్ ను కేకేఆర్ రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. అయితే ముస్తాఫిజుర్ ను రిలీజ్ చేసిన తరుణంలో బంగ్లా ప్రభుత్వం ఆ దేశ లీగ్ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని కోరుతూ ఐసీసీకి లేఖ రాయాలని బీసీబీని ఆదేశించింది. ఇదిలా ఉండగా టీ-20 వరల్డ్ కప్ కు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో వేదిక మార్పు అనేది చాలా క్లిష్టం అని విశ్లేషణలు వస్తున్నాయి.










