𝗣𝗖𝗕 𝗦𝘂𝘀𝗽𝗲𝗻𝗱𝘀 𝗣𝗹𝗮𝘆𝗲𝗿’𝘀 𝗡𝗢𝗖𝘀 𝗔𝗳𝘁𝗲𝗿 𝗔𝘀𝗶𝗮 𝗖𝘂𝗽 𝗙𝗶𝗻𝗮𝗹 𝗗𝗲𝗳𝗲𝗮𝘁 | ఆసియా కప్-2025లో భారత్ చేతిలో ముచ్చటగా మూడు సార్లు పరాజయం పాలైన పాకిస్థాన్ నవ్వులపాలైంది.
లీగ్ దశలో, సూపర్-4, ఫైనల్స్ లో పాకిస్థాన్ ను చిత్తు చేసిన టీం ఇండియా తొమ్మిదవసారి ఆసియా కప్ ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో పాక్ ప్లేయర్లపై స్వదేశంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఆ దేశ మాజీ క్రికెటర్లు ప్లేయర్ల ఆటతీరుపై మండిపడుతున్నారు.
ఇదే సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకనుంచి విదేశీ లీగుల్లో పాల్గొనేందుకు తమ ప్లేయర్లకు అవకాశం ఇవ్వకూడదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు ‘నో అబ్జక్షన్ లెటర్’ ను జారీ చేయకూడదని పీసీబీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
విదేశీ లీగుల్లో పాల్గొంటే ప్లేయర్ల ఆటతీరుపై తీవ్ర ప్రభావం పడుతుందని, నిలకడ లోపిస్తుందని పీసీబీ భావిస్తున్నట్లు పలువురు విశ్లేషణలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పీసీబీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదురుకుంటుంది. ఈ సమయంలో ఈ నిర్ణయంతో అటు బోర్డు, మరోవైపు ప్లేయర్లకు ఆర్థికంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.










