Ys Jagan News | పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అనే వ్యక్తి రౌడీ రాజకీయాలు, మోసాలు, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని మరోసారి రుజువైందని జగన్ ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ(ZPTC) స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ చంద్రబాబు చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు అని పేర్కొన్నారు.
చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరి కొంతమంది పోలీసులు వీరంతా ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్నికల పోలింగ్ రోజున, ఓటింగ్ తగ్గించేందుకు, తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జగన్ ఆరోపణలు చేశారు. అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి సిగ్గుపడాలన్నారు










