Youth Congress Counter To YS Jagan | ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వేదిక వద్దకు చేరిన యూత్ కాంగ్రెస్ బృందం చొక్కాలు విప్పి నిరసన చేపట్టింది.
ఈ ఘటనను దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు ఖండించాయి. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా యూత్ కాంగ్రెస్ చర్యను తప్పుబట్టారు.
“నిన్న జరిగిన ఏఐ (AI) సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ ప్రవర్తన మనందరినీ తలదించుకునేలా చేసింది. మన రాజకీయాలు ఎటు వైపు వెళ్తున్నాయి?
రాజకీయ విభేదాలు ఏవైనా ఉండవచ్చు, కానీ ప్రపంచ వేదికపై మన దేశాన్ని కించపరచడం సరికాదు. ప్రపంచం ముందు మనం ఎప్పుడూ ఐక్యంగా ఉండాలి” అని జగన్ ట్వీట్ చేశారు. అయితే జగన్ కు యూత్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
“డియర్ జగన్.. మీ తండ్రి, మా గర్వకారణమైన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) గారు విభజన శక్తులు మరియు రాజీ పడే శక్తులకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడారు.
మీకు సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయని మాకు తెలుసు.. కానీ కనీసం మీ తండ్రి వారసత్వాన్ని ఇలా బహిరంగంగా తాకట్టు పెట్టకండి” అంటూ ఘాటుగా బదులిచ్చింది.
ఈ పరిణామంతో వైఎస్సార్ వారసత్వంపై అటు కాంగ్రెస్, ఇటు జగన్ మధ్య మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది.










