Mamta Banerjee | రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కునేందుకు ఏర్పడ్డ విపక్షాల కూటమి ఇండియా కు ఊహించని షాక్ ఎదురైంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. కూటమిలోని కీలక పార్టీ కాంగ్రెస్తో సీట్ల పంపకానికి సంబంధించి చర్చలు విఫలమయ్యాయని ఆమె పేర్కొన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రతిపాదన ఇచ్చినా అన్నింటినీ తిరస్కరించారని మమత తెలిపారు. అందుకే బెంగాల్లో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని ఒంటరిగానే ఎదుర్కొంటామని తెలిపారు.
ఫలితాల తర్వాతే పొత్తులపై తుది నిర్ణయం ఉంటుందని దీదీ ఈ సందర్భంగా వెల్లడించారు. మరోవైపు రాహుల్ యాత్ర (Rahul Yatra)పై కూడా దీదీ స్పందించారు. ఇండి కూటమిలో ఉన్నప్పటికీ రాహుల్ యాత్రపై మాకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.
రాష్ట్రం మీదుగా రాహుల్ యాత్ర సాగనున్నా తమకు సమాచారం ఇవ్వలేదు అని దీదీ కాంగ్రెస్పై అసంతృప్తి వ్యక్తం చేశారు.